శ్మశాన సౌందర్యం
చలి ఎక్కువైంది. ఎముకలు కొరికే చలి. ‘దెయ్యాలకు ఎముకలు ఉండవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ చలికి చచ్చి, మనుషులయ్యేవి’.. అని చిన్న స్లిప్పులో బాల్పెన్తో రాసుకుని ఆ స్లిప్పునీ, పెన్నునీ తిరిగి జేబులో పెట్టుకున్నాడు కల్పేశ్.ఆ ముక్క రాసుకోడానికి కాస్త ముందు, కల్పేశ్ అదే స్లిప్పులో ఇంకో ముక్క కూడా రాసుకున్నాడు. ‘వెన్నెలే లేకపోయుంటే ఇంత శ్మశాన సౌందర్యం మనిషికి దక్కేది కాదేమో!’ అని. శ్మశానంలో అంత రాత్రప్పుడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు కల్పేశ్. ఎంత రాత్రప్పుడో కల్పేశ్ చూసుకోలేదు. ‘అంత రాత్రప్పుడు’ అని మనం అనుకోవడమే కానీ, కల్పేశ్కి అది అంత రాత్రి, ఇంత రాత్రి కాదు. రాత్రి మాత్రమే! మనుషుల్ని చూసినవాడు చీకటిని కొలుచుకుని, చీకటిని తలచుకుని భయపడడు. బాగా చలిగా ఉంది. బాగా చలిగా ఉన్నట్లనిపించడం చలి ఎక్కువై కాదు.. ఆ రోజు అక్కడ.. మండుతున్న చితి ఒక్కటి కూడా లేకపోవడం అని కల్పేశ్ గ్రహించాడు. కల్పేశ్ బాగుంటాడు. శ్మశానంలో రాత్రి పూట, అదీ.. సమాధి అరుగు మీద ఒంటరిగా కూర్చొని, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న మనిషి గురించి ఇలా చెప్పడం అసందర్భంగా ఉంటుంది. అయినా చెప్పాలి. కల్పేశ్ బాగుంటాడు. బా...